*టెన్త్తో తపాలా ఉద్యోగం*
మీ ప్రాంతంలో పదో తరగతిలో మెరుగైన మార్కులు సాధించారా? అయితే.. కేంద్రప్రభుత్వ కొలువు పొందే అవకాశం మీకున్నట్టే! రాతపరీక్ష రాయనక్కర్లేదు. ఇంటర్వ్యూకూ హాజరు కానవసరం లేదు. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 3446 గ్రామీణ్ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. కేవలం పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ పోస్టులను భర్తీ చేయబోతున్నారు.
*టెన్త్తో తపాలా ఉద్యోగం*
తాజా ప్రకటన ద్వారా బ్రాంచి పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచి పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేస్తారు. ఏపీలో 2296, తెలంగాణలో 1150 పోస్టులున్నాయి.
ఎంపికైన పోస్టు, సేవల వ్యవధి అనుసరించి వీరికి కనిష్ఠంగా రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.14,500 ప్రతి నెలా చెల్లిస్తారు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
బ్రాంచి పోస్టు మాస్టర్గా ఎంపికైనవారు సంబంధిత బ్రాంచి కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ లావాదేవీలు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవాలి. పోస్టల్కు సంబంధించిన మార్కెటింగ్ వ్యవహారాలూ చక్కబెట్టాలి. బృందనాయకుడిగా సంబంధిత బ్రాంచిని నడిపించాలి.
అసిస్టెంట్ బ్రాంచి పోస్టు మాస్టర్ (ఏబీపీఎం)గా ఎంపికైనవారు స్టాంపులు/స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడడం, ఇండియన్ పోస్టు పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు చక్కబెట్టాలి. బ్రాంచి పోస్టుమాస్టర్ చెప్పిన పనులు పూర్తిచేయాలి.
డాక్ సేవక్గా ఎంపికైనవారు ఉత్తరాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. అలాగే స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం చెప్పిన పనులు పూర్తిచేయాలి. రైల్వే మెయిల్ సర్వీస్, పోస్టల్ పేమెంట్ బ్యాంకు పనులు చూసుకోవాలి.
*వేతనాలు*
సేవలు అందించిన పనిగంటల ప్రకారం వీరికి వేతనాలు ఉంటాయి. అంటే కొన్ని శాఖలకు రోజుకి 4 గంటలు, మరికొన్ని శాఖలకు 5 గంటల పని వ్యవధిని నిర్దేశించారు. అందువల్ల ఎంపికైన బ్రాంచ్ బట్టి వేతనం మారుతుంది. రోజుకి 4 గంటలు చొప్పున సేవలు అందించే కార్యాలయానికి బీపీఎంగా ఎంపికైతే రూ.12 వేలు, అదే 5 గంటలు సేవలు అందించే శాఖలో విధులు నిర్వహిస్తే రూ.14,500 పొందుతారు. ఏబీపీఎం/డాక్ సేవక్ పోస్టులకు ఎంపికైనవారు 4 గంటల సేవలకు గాను రూ.పదివేలు, 5 గంటలకైతే రూ.12,000 అందుకుంటారు. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ఏబీపీఎం/ డాక్ సేవక్లకు ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/కంప్యూటర్/స్మార్ట్ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరుస్తుంది.
ఎంపిక విధానం
అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు. ప్రకటలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, పని సమయాలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్డ్/ అన్ రిజర్వ్డ్ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్థులు పరిశీలించి, గరిష్ఠంగా 20 ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అయితే ఒక్కో సెట్లో 5 చొప్పున ఆప్షన్లు నమోదుకు అవకాశం ఉంటుంది. మొదటి ప్రాధాన్యం ఇస్తోన్నదానికి ఆప్షన్-1 తర్వాత దానికి ఆప్షన్-2...ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్ఎంఎస్/ఈమెయిల్/పోస్టు ద్వారా అందుతుంది.
రాత పరీక్ష, ఇంటర్వ్యూలు లేవు
ఆంధ్రప్రదేశ్లో 2296, తెలంగాణలో 1150 ఖాళీలు
ఏ అర్హతలుండాలి?
పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండడం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. బేసిక్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి. కనీసం 60 రోజల వ్యవధికి తగ్గకుండా శిక్షణ తీసుకున్నట్లు ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుంచి దీన్ని పొందాలి. అయితే దీన్ని ఉద్యోగానికి ఎంపికైన తర్వాత కూడా అందించవచ్చు. పదోతరగతి/ఇంటర్/ఉన్నత విద్యలో కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా చదువుకున్నవారికి ఈ సర్టిఫికెట్ అవసరం లేదు.
వయసు: జనవరి 27, 2021 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు వర్తిస్తుంది.
ఫీజు: మహిళలు, దివ్యాంగులు, ట్రాన్స్ జండర్లు, ఎస్సీ, ఎస్టీలకు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.వంద చెల్లించాలి.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 26. https:appost.in/gdsonline/Home.aspx

0 Comments
Please do not enter any spam link in the comment box